చిలుకూరు : ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యం పక్క దారి పడుతోంది. ప్రభుత్వ ధాన్యాన్ని చిలుకూరులోని మిల్లుల్లో స్టాక్ పెడితే సదరు మిల్లు యాజమాన్యం ఏకంగా లారీల్లో బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మండలంలోని నారాయణపురం, చిలుకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు మండలంలోని రామాపురం గ్రామంలోని రైస్ మిల్లుకు అప్పగించారు. మిల్లు నిర్వాహకులు చిలుకూరులో ఒక గోదామును కిరాయికు తీసుకొని స్టాక్ వేశారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా ధాన్యం రేటు (77.50 కేజీలపై) సుమారుగా రూ. 3 వేల వరకు ఉంది. దాంతో సదరు మిల్లు నిర్వాహకులు ప్రభుత్వ ధాన్యాన్ని ఇతరులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో గోదాము నుంచి 2 లారీల ధాన్యం బయటి వ్యక్తులకు అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం అడిగిన సమయంలో తక్కువ ధరకు లభించే ధాన్యం కొనుగోలు చేయడమో, లేదా ఏదో ఒక రకం బియ్యాన్ని పంపి లెక్కలు చూపించుకుంటురని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యు, సివిల్ సప్లై అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.3.8 కోట్ల ధాన్యం మాయం
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు పరిధిలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్యేశ్వర మోడ్రన్ రైస్మిల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.3.8 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. అసలు ఉండాల్సిన ధాన్యంలో 2050.280 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు గుర్తించిన అధికారులు మిల్లు యజమాని వై.రమేష్పై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఉమ్మడి నల్లగొండ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సీఐ గౌస్, డీసీఎస్ఓ మోహన్బాబు, డీటీసీఎస్లు రాజశేఖర్, గిరిప్రసాద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఫ గోదాములో నిల్వ ఉంచిన ధాన్యం అమ్ముకుంటున్న మిల్లర్లు
ఫ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్


