హుజూర్నగర్ : మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం హుజూర్నగర్లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ డీఏపీ బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు మండలంలోని రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు
పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావులకు సంబంధించి డీఏపీ తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 బస్తాల నకిలీ డీఏపీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లా లింగనవాయికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రం విజయపురిజిల్లా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, మారుతి కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ బస్తాలు, మిషన్, నకిలీ పాస్పేట్, రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీ నం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
ఫ వివరాలు వెల్లడించిన
డీఎస్పీ శ్రీనివాసరెడ్డి


