నాగారం: భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భవిత కేంద్రాలకు భరోసా కల్పిస్తూ నిధులు విడుదల చేసింది. జిల్లాలో 27 భవిత కేంద్రాలు ఉండగా సొంత భవనాలు కలిగిన ఏడు కేంద్రాలకు వివిధ పరికరాలు, సామగ్రి కొనుగోలుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.14లక్షలు మంజూరు చేస్తూ... సమగ్ర శిక్షా ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. సుమారు పదేళ్ల తరువాత భవిత కేంద్రాలకు నిధులు కేటాయించడంతో విద్యార్థుల సమస్యలు తీరుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యేక కమిటీ ద్వారా..
జిల్లా వ్యాప్తంగా 2,900 మందికిపైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. ఒక్కో భవిత కేంద్రంలో 20 నుంచి 30 మంది చొప్పున చిన్నారులకు ఐఈఆర్పీలు రోజూ ఫిజియోథెరపీ చేసి ఆటాపాటలతో కూడిన విద్యనందిస్తున్నారు. కేంద్రాలు లేనిచోట నాన్ ఐఈఆర్సీ కేంద్రాల్లో విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పాత భవిత కేంద్రాలకు మంజూరైన నిధులతో ప్రత్యేక కమిటీ ద్వారా సౌకర్యాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, భవిత కేంద్రం అనుసంధానంగా ఉన్న హెచ్ఎం నేతృత్వంలో వీటిని సమకూర్చనున్నారు.
115 రకాల సామగ్రి అందుబాటులోకి..
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వచ్చిన నిధులతో 115 రకాల సామగ్రి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఐఈఆర్పీలకు కుర్చీలు, చికిత్స అందించే బల్లలు, మసాజ్బాల్, డంబెల్స్, రౌండ్ టేబుల్, బీరువాలు తదితర సామగ్రిని అందిస్తారు. వీటి కొనుగోలు, వినియోగంపై మార్గనిర్దేశం చేశారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధన, చికిత్స అందిస్తారు.
ప్రత్యేక విద్యార్థులకు ఎంతో మేలు
ప్రభుత్వం సమగ్ర శిక్షా నుంచి భవిత కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవరమయ్యే బోధనోపకరణాలు అందుబాటులోకి తీసుకొస్తాం. తద్వారా విద్యానైపుణ్యాల పెంపొందించడంతో ప్రత్యేక విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
ఫ సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు
ఫ ఒక్కో కేంద్రానికి రూ.2లక్షలు
ఫ ఏడు సెంటర్లకు రూ.14లక్షలు
ఫ ప్రత్యేక అవసరాలు గల
విద్యార్థులు 2,900 మంది