ఆమదాలవలస: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ క్యాడర్ పనిచేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆమదాలవలస పట్టణంలోని శారద కల్యాణమండపంలో శనివారం పార్టీ ఆమదాలవలస నియోజవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడవద్దని, ప్రతి కార్యకర్తకు, నా యకుడికి పార్టీ క్యాడర్, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి తలుపు తట్టినా మీ వెంటే ఉంటామని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందన్నారు. ప్రస్తుతం టీడీపీ పాలనలో రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదని, రూ.300 విలువ చేసే యూరియాను ఒడిశాకు వెళ్లి రూ.వెయ్యికి కొనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెన్నుపోటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ విషయం గ్రామస్థాయి లో కార్యకర్తలు తెలియజెప్పాలన్నారు. అధికారు లు నిష్పక్షపాతంగా పనిచేయాలని లేకుంటే డిజిటల్ బుక్లో నమోదు చేసిన తర్వాత వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు వేల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం పెడుతూ ఆ సొత్తు అంతా అమరావతిలో తన స్వలాభానికి వాడుకుంటున్నారని విమర్శించారు.


