చినుకుపడితే వణికిపోతున్న నదీతీర ప్రాంతాల ప్రజలు
పూర్తికాని కరకట్టల పనులు
పట్టించుకోని అధికారులు
చర్యలు చేపడతాం..
ఏటా వర్షం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్నపాటి వర్షం వచ్చి నా పొలాల్లోకి నీరు చేరిపోతుంది. పంటలన్నీ ముంపులో ఉండిపోయి, పాడవుతున్నాయి. తరాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదు. – తొత్తడి సురేష్, రైతు, బూర్జ గ్రామం
కరకట్టలు నిర్మించకపోవడంతో వర్షాలు ఎక్కువగా పడితే వ్యవసాయ భూము లు ముంపునకు గురవుతున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఇటువ్యవసాయ రైతులు, అటు నదీతీర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలి.
– భవిరి ధనుంజయరావు, రైతు, బూర్జ గ్రామం
బూర్జ:
చినుకు పడితే చాలు ఎక్కడ ఊరు వరదగా మారుతుందోనని వంశధార, నాగావళి నదులను ఆనుకుని ఉన్న తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటారు. జూన్ నుంచి దాదాపుగా నాలుగైదు నెలలపాటుగా భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా రెండున్నర ఏళ్లు దాటినా ఇంతవరకు కరకట్టల ఆలోచన చేయకపోవడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నాగావళి ఇలా..
నాగావళి నది జిల్లాలో సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వరదలువస్తే ఎక్కువగా బూర్జ మండలంలోని లాభాం, బూర్జ, వావాం, మామిడివలస, లంకాం, కాఖండ్యాం, అల్లెన, ఆమదాలవలస మండలంలోని దూసి, తోగరాం, కలివరం, ముద్దాడ పేట, దూసిపేట, తోటాడ, ఇసుకలపేట, శ్రీకాకుళం మండలంలోని బలగ, హయాతినగరం, ఫాజుల్బాగ్పేట తదితర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంటుంది. 2007లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. భూసేకరణ పనులు పూర్తికాకపోవడంతో కరకట్టల నిర్మాణంలో జాప్యం తప్పడం లేదు.
వంశధార అలా..
జిల్లాలో వంశధార నది కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రవహిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బత్తిలిలో మొదలుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని గార మండలం వరకు అనేక గ్రామాలకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు. పనులు సులభంగా పూర్తి చేసేందుకుగాను వంశధార కరకట్టల పనులను నాలుగు విడతలుగా విభజించారు. పనులు కొంత మేర జరి గినా తర్వాత పట్టించుకోకపోవడంతో తీర గ్రామా ల ప్రజలకు ముంపు భయం తప్పడం లేదు.
వంశధార, నాగావళి కరకట్టల పరిధిలో నదీతీర ప్రాంత గ్రామాల్లో అత్యంత ప్రమాదకరమైన పాయింట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపించాం. వంశధార ప్యాకేజీ–2 ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు భామిని, కొత్తూరు, హిరమండలం మండలాల్లో తుంగతంపర వరకు వేశారు. భూ సేకరణ జరిగిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నాం. వచ్చే సీజన్ నాటికి అన్నిచోట్లా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
– పొన్నాడ సుధాకర్, జలవనరుల శాఖ ఎస్ఈ


