శ్రీకాకుళం కల్చరల్ : విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాల సాహిత్య సమ్మేళనం విజయవంతం చేయాలని సాహితీవేత్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. కవిత్వం, కథ, పాట ప్రక్రియల్లో జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో ప్రసిద్ధ రచయితలతో యువ రచయితలకు ముఖాముఖి ఉంటుందని కథా రచయిత అట్లాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు తెలిపారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు, విశ్వసాహితీ ఆమదాలవలస ప్రధాన కార్యదర్శి కర్నేన జనార్దనరావు, కథా నిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ప్రతినిధి ఎం.ప్రభాకర్రావు, పి.సుధాకర్రావు, నెట్టిమి రమణారావు, పూజారి దివాకర్, ఉదయ్కిరణ్, బాడాన శ్యామలరావు, భోగేల ఉమామహేశ్వరరావు, వాసవి పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
శ్రీకాకుళం: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ, చట్టంలో సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక్కడి ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చింతాడ దిలీప్, జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మామిడి భుజంగరావు, కార్యదర్శి సుమలత, గున్న ప్రసాదరావు, నవీన్, అనంత ఆచార్యులు, వై.వి.రమణ, జితేంద్ర, కిరణ్, బాలాజీ, లక్ష్మణ్, సూర్యనారాయణ, భాస్కరరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు తరహాలో తీర్మానం చేయాలి
టెక్కలి: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్కు సంబంధించి తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ తీర్మానం చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెగ్యులర్ టెట్ రాసిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల అర్హత 60 మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణత ప్రకటించాలని కోరారు.
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
టెక్కలి : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేలా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.కిశోర్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం టెక్కలిలో ద్విచక్రవాహనాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు శాశ్వతంగా టెట్ నుంచి మినహాయించాలన్నారు. కోర్టు తీర్పు ను సాకుగా చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై చేస్తున్న పోరాటాలను నీరుగార్చేందుకు టెట్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, కె.దాలయ్య, కె.వైకుంఠరావు, గణపతి, జి.నారాయణరావు, డి.లక్ష్మినారాయణ, డి.పాపారావు, జి.మోహన్రావు, గణపతి తదితరులు పాల్గొన్నారు.


