శ్రీకాకుళం న్యూకాలనీ: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా శనివారం జరగనున్న జిల్లాస్థాయి వేడుకలకు ప్రధాన వేదికతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ప్రెస్అండ్ మీడియా, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధులు, వీక్షకులు ఇలా వేర్వేరుగా గ్యాలరీలు సిద్ధం చేశారు. డ్వామా, సమగ్రశిక్ష–విద్యాశాఖ, డీఆర్డీఏ, ఐసీడీఎస్, వివిధ సంక్షేమ శాఖల శకటాలు సిద్ధమయ్యాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మైదానంలో పోలీసులు రిహార్సల్స్గా కవాతు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. విద్యార్థులు సైతం మాక్డ్రిల్ కోసం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిక్షణ పొందుతున్నారు. కాగా, ఆకాశం మేఘావృతం అవుతుండటం, వాతావరణశాఖ ప్రకటనలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జి.సిగడాం: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జి.సిగడాం మండలం బూటుపేట పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్ కూర్మాన అరుణకుమారిని ఫిన్లాండ్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ శిక్షణలో అక్కడి విద్యాబోధనను పరిశీలిస్తారు. ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్, తుర్కు, రౌమా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే అమరావతిలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ సందర్భంగా అరుణకుమారిని జి.సిగడాం ఎంఈఓలు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావు అభినందించారు.


