నరసన్నపేట: అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు గుప్పించాయని, అధికారం చేతికొచ్చాక అవన్నీ పక్కన పెట్టి ప్రజాకంఠకంగా పాలన సాగిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు, బొత్స సంతోష్ మండిపడ్డారు. యువతకు నిరుద్యోగ భృతి ప్రకటించాలని, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పింఛన్లు ఇవ్వాలని, పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సత్యవరం జంక్షన్ నుంచి పల్లిపేట జంక్షన్ వరకూ సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సీపీఐ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


