సోంపేట : బీల ప్రాంతంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల నిర్మాణానికి విడుదల చేసిన జీఓ 329 రద్దు చేసి చిత్తడి నేలల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని పర్యావరణ పరిరక్షణ సంఘ నాయకులు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. థర్మల్ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెంది 16 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మంగళవారం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ చిత్తడి నేలల మనుగడతోనే మానవ మనుగడ సాగుతుందన్నారు. భూమికి కిడ్నీలు వంటి చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యదర్శి తమ్మినేని రామారావు మాట్లాడుతూ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ బీల ప్రాంతంలో చేపల చెరువుల నిర్మాణానికి ఏర్పాటు చేసిన గట్లు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, సూరాడ చంద్రమోహన్, సనపల శ్రీరామమూర్తి, వైశ్యరాజ్ నాగు, సత్యరాజ్, డిక్కల దామోదరం, బెందాళం వెంకటరమణ, సింహాచలం పాడి, బి.బాబూరావు, టి.కోదండ, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


