శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు, నకిలీలు, కల్తీల నియంత్రణకు జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి (డీసీపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చైర్పర్సన్గా వ్యవహరించగా, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, ఆహార భద్రతా విభాగాలు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే మోసపూరిత ప్రకటనలపై, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయించే వ్యాపారులపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లా సరఫరాల అధికారి సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వినియోగదారుల సేవా సంస్థల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బగాది రామమోహనరావు, సీనియర్ న్యాయవాది అన్నెపు భువనేశ్వర్, శ్రీకాకుళం కన్జూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బమ్మిడి నరేంద్రకుమార్, లఖినాన వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.


