బూత్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
గత నెల రోజులుగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నేటితో ముగియనుంది. అనేక సందేహాలు, అనుమానాలు, ఆరోపణలు, అభ్యంతరాల నడుమ జిల్లాలో ఒక్కరోజు ముందే సర్ కార్యక్రమం దాదాపు ముగిసింది. జిల్లాలో ఉన్న ఓటర్లలో 851 మినహా మిగతావన్నీ సోమవారం సాయంత్రానికి డిజిటలైజేషన్ దాదాపు పూర్తయింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో 100శాతం డిజిటలైజేషన్ జరిగిపోయింది. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, తిరిగి సేకరించిన ఫారాలు, డిజిటలైజేషన్ పూర్తయినట్టు అధికారులు అంకెలు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నేటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని, తిరిగి తీసుకోలేదని చెబుతున్న ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం శతశాతం పూర్తయిపోయిందని దాదాపు సర్దేశారు. ఇక, ప్రతిపాదిత జాబితా వచ్చాకే లొసుగులు, చిక్కులు బయటపడనున్నాయి. డిజిటలైజేషన్ సమయానికే జిల్లాలో లక్షా 63వేల 757ఓట్లు పోయాయి. డెత్లు, డూప్లికేట్లు, ఆబ్సెంట్, షిప్టింగ్, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ పేరుతో తేలిపోయాయి. ఇక, డిజిటలైజేషన్ చేసిన మిగతా ఓట్లలో ఎన్ని పోతాయన్నదే చూడాల్సి ఉంది. చాలా చోట్ల బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదని, టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో అనేక కథనాలు కూడా వచ్చాయి. కథనాలు వచ్చాక అందులో పేర్కొన్న కేస్ స్టడీస్ ఆధారంగా స్పందిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం, తిరిగి తీసుకోవడం చేసినా దృష్టికి రానివి ఎన్నో ఉండిపోయాయి. అవన్నీ ప్రతిపాదిత జాబితా వచ్చాక బయట పడనున్నాయి. మొత్తానికి అధికార యంత్రాంగమైతే సర్ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది.
నియోజకవర్గం పోలింగ్ మొత్తం ఓటర్లు యూఈఎఫ్ డిజిటలైజేషన్ శాతం
శ్రీకాకుళం 279 2,75,852 23,143 2,75,001 99.69
ఇచ్ఛాపురం 299 2,73,230 30,551 2,73,230 100
పలాస 284 2,22,430 19,732 2,22,430 100
టెక్కలి 315 2,38,703 18,980 2,38,703 100
పాతపట్నం 323 2,28,424 19,596 2,28,424 100
ఆమదాలవలస 259 1,93,043 14,594 1,93,043 100
ఎచ్చెర్ల 309 2,48,748 21,633 2,48,748 100
నరసన్నపేట 290 2,16,975 15,528 2,16,975 100
జిల్లాలో ఒక రోజు ముందే దాదాపు పూర్తి
851 మినహా దాదాపు డిజిటలైజేషన్
లక్షా 63వేల 757 ఓట్లు ఇప్పటికి పోయినట్టే


