ఫారాలతో పాట్లు..
● ఆఖరి దశకు చేరుకుంటున్న ‘సర్’
● అర్ధరాత్రిళ్లూ పనిచేయిస్తున్న వైనం
● కార్యాలయాల్లోనే ఎన్యుమరేషన్
డేటా ఎంట్రీలు
సాక్షి నెట్వర్క్ :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనూ గందరగోళం వదలకపోవడం గమనార్హం. ముఖ్యంగా మైగ్రేషన్, డబుల్ ఎంట్రీ, చనిపోయిన ఓటర్లను గుర్తించడంలో ఇప్పటికీ అయోమయమే నెలకొంది. ప్రధానంగా ఒడిశాతో సంబంధ బాంధవ్యాలు ఉన్న గ్రామాల్లో కొత్త కోడళ్ల కుటుంబ వివరాలు తెలుసుకోవడం తలకు మించిన భారమైంది.
అర్ధరాత్రి ఆపసోపాలు..
టార్గెట్ దగ్గరపడుతుండడంతో చాలా చోట్ల సిబ్బంది అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లోనే ఉంటూ పనులు చేశారు. ముఖ్యంగా పోలాకి మండల కేంద్రంలో సర్ కార్యక్రమం వెనుకబడటంతో శనివా రం అర్ధరాత్రి వరకు తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ రాజారెడ్డి స్థానిక సచివాలయంలో ఉండి సిబ్బందితో ఫారాలు అప్లోడ్ చే యించారు. మిగిలిన చోట్ల కూడా రాత్రిళ్లు పనిచేస్తూ సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు.
అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లో ఫీట్లు.. ఫారాల పంపిణీలో ఎడతెగని పాట్లు.. ఆన్లైన్ చేసేందుకు ఆపసోపాలు.. వెరసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుంటోంది. అందరికీ ఫారాల పంపిణీ అయిపోయిందని అధికారులు అంకెలు చూపిస్తుంటే.. అసలు తమకు ఇవ్వనే లేదని చాలా మంది రంకెలు వేస్తూనే ఉన్నారు. వందశాతం ఆన్లైన్ జరిగి తీరాల్సిందే అంటూ ఉన్నతాధికారులు సూచనలు చేస్తుంటే.. అర్ధరాత్రి ఆవులింతలు తీస్తూ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
ఆ ఓటర్ల గతేమిటో..?
మరో రెండు రోజుల్లో సర్ ముగియనుంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో నివసిస్తున్న, వలస ఓటర్ల ఆచూకీ తెలియకపోవడం విస్తు గొలుపుతోంది. వారి ఓట్లు ఉంటాయో, ఊడుతాయో అన్నది ముసాయిదా జాబితా వచ్చే నాటికి తెలుస్తుంది. కొన్ని చోట్ల ఫోన్లతో మేనేజ్ చేస్తున్నారు. అయినా చాలా మంది వివరాలు తెలియరావడం లేదని సిబ్బందే చెబుతున్నారు.


