శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా సాగుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియాలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 90.39 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. ప్రజలు సందేహాల నివృత్తికి ‘బుక్ ఏ కాల్ విత్ బి ఎల్ ఓ‘ ఆప్షన్ వాడుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి సహాయం కోసం 9491 222 122 నంబర్ను, కామన్ హెల్ప్ లైన్ 1950ను సంప్రదించవచ్చని వివరించారు.
14,269 మెట్రిక్ టన్నుల యూరియా సిద్దం
జిల్లాలో యూరియా కొరత ఏ మాత్రం లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 14,269 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆధార్–మొబైల్ లింక్ లేని వారు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. 50 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఇద్దరు ముగ్గురు కలిసి గ్రూప్గా ఏర్పడి బస్తా యూరియా తీసుకో వచ్చని తెలిపారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు స్వయంగా రానవసరం లేదని, కొరియర్ లేదా అథరైజేషన్ ఆప్షన్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఓటీపీ చెబితే వారి తరఫున యూరియా అందజేస్తామన్నారు.


