26న రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని, ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణపై ఎవరైనా తమ అమూల్యమైన సూచనలు ఇవ్వవచ్చని, వాటిని నిశితంగా పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


