మోసాలకు చెల్లు
● సేవా లోపాలపై ఫిర్యాదులకు రశీదు తప్పనిసరి
● వినియోగదారుల ఫోరంతో మోసాలకు అడ్డుకట్ట
● నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం
బిల్లుతో
హిరమండలం/పాతపట్నం/శ్రీకాకుళంపాతబస్టాండ్: నిత్య జీవితంలో అవసరాలకు అనుగుణంగా ప్రతి రోజూ దుకాణంలో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుంటాం. కొన్నిచోట్ల కొందరు దుకాణదారులు నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. కనీసం రసీదు కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంటారు. ఇంటికెళ్లి చూశాకే అనవసరంగా మోసపోయామే.. అంటూ బాధపడు తుంటాం. నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తున్నా ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటాం. ఇలాంటి సమంయంలో వినియోగదారుల కోసం ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ అండగా నిలుస్తుంది. వస్తువుల నాణ్యతలో తేడాలు వచ్చినప్పుడు రశీదు ఉంటే తగిన పరిహారం పొందే వీలు కల్పి స్తుంది. బుధవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ‘సుస్థిర జీవన శైలికి న్యాయమైన పరివర్తన’ అనే థీమ్తో ఈ ఏడాది జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15న నిర్వహిస్తుండగా మన దేశంలో 1986 డిసెంబర్ 24న వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఏర్పడటంతో అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 24నే జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
సమస్య పరిష్కారం ఇలా..
మోసాలు, కొలతలు, ఇబ్బందులు, సేవలు ఇలా ఏ అంశంలోనైనా వినియోగదారునికి ఇబ్బంది కలిగితే వినియోగదారుల పరిరక్షణ చట్టం ద్వారా పరిష్కారంతో పాటు పరిహారం కూడా పొందే వీలుంది. వినియోగదారుల సేవలకు ఆటంకం నష్టం కలిగితే సంబంధితవ్యక్తులు, సంస్థలపై ఫిర్యాదు చేయ వచ్చు. వినియోగదారుల తూకాల్లో మోసపోయి నా, వస్తువుల్లో నాణ్యత లోపించినా సేవలు సక్రమంగా అందకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. చిన్న సూది నుంచి బ్యాంకింగ్, ఆసుపత్రి, రైల్వే, విమానయానం, విద్యుత్, ఆన్లైన్ వ్యాపారాలు, కొరియర్ సర్వీస్, గ్యాస్, ఫుడ్ డెలవరీ ఇలా అన్ని రకాల సేవల విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. మార్కెట్లో కొనుగోలు చే సే వస్తువుల నాణ్యత ప్రమాణాల్లో లో పాలు, తేడాలు, ఎంఆర్పీ కంటే ఎక్కు వ వసూలుచేసినా, వస్తువుల్లో ముద్రించిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
బిల్లు తప్పనిసరి..
జిల్లాలో 30 మండలాల పరిధిలో వేలాది దుకాణాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, కొన్ని సూపర్మార్కెట్లలో తప్ప మిగిలిన చోట్ల బిల్లులు ఇవ్వడం లేదనేది బహిరంగ సత్యం. ముఖ్యంగా వినియోగదారులే బిల్లు తీసుకునేందుకు ఆసక్తి చూపకుండా వస్తువులు కొనుగోలు చేసిన వెంటనే వెళ్లిపోతుంటారు. ఇదే అంశం దుకాణదారులకు వరంగా మారుతోంది. మరికొన్ని చోట్ల వ్యాపారులు తెల్లకాగితం రాసి ఇస్తున్నారే తప్ప సరైన బిల్లు ఇవ్వడం లేదు.
అవగాహన కరువు..
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి ప్రజలకు కనీస అవగాహన ఉండటంలేదు. అధికారులు కూడా అవగాహన కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఫిర్యాదు ఇలా..
వస్తువు కొనుగోలు చేసినప్పుడు కచ్చితమైన, సరైన రశీదు(బిల్లు) తీసుకోవాలి.
వినియోగదారుని పేరు, చిరునామా, ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో వారి పేర్లు రాయాలి.
కొనుగోలు చేసిన వస్తు సేవల వివరాలు, బిల్లు నంబరు, నష్టం విలువ అంకెల్లో రాయాలి
కోరుకుంటున్న పరిహారం వివరాలను దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి.
గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘాల ద్వారా మొదటి తరగతి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. నష్టపరిహారం కోసం వినియోగదారుల జిల్లా ఫోరం సహాయం కోరవచ్చు. అక్రమ వ్యాపారులను, మోసాలను అరికట్టెందుకు తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వారికి ఫిర్యాదు చేయవచ్చు.
వినియోగించుకోండి..
ఇటీవల కాలంలో విస్తరించిన ఆల్లైన్ వ్యాపారాల్లో ఎన్నో మోసాలు చోటు చేసుకున్నాయి. మోసాల నుంచి భరోసా పొందేందుకు వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించవచ్చు.
– ఎ.వెంకట సురేష్, కార్యదర్శి,
జిల్లా వినియోగదారుల సంఘం, హిరమండలం
జాగ్రత్తలు తీసుకోవాలి
సమగ్ర వివరాలు తెలుసుకున్న తర్వాతే వస్తువులు కొనేందుకు సిద్ధపడాలి. కొనుగోలు చేసిన తర్వాత మోసపోతే వినియోగదారుల హక్కుల చట్టాన్ని వినియోగించుకుని పరిహారం పొందవచ్చు.
– మడ్డు తాతయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు,
కొరసవాడ, పాతపట్నం మండలం
నేడు అవగాహన సదస్సు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వినియోగదారులు, ఆహార పౌర సరఫరాలు, మానవ వనరుల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మోసాలకు చెల్లు
మోసాలకు చెల్లు
మోసాలకు చెల్లు


