●స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
పుట్టపర్తి అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. పుట్టపర్తి సమీపంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ (శిరసాని హిల్స్) వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ను, వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులను సిద్ధం చేశారు. జిల్లా కార్యాలయాలను త్రివర్ణంతో కూడిన విద్యుత్ దీపాలు, తోరణాలు, రంగవల్లులతో అలంకరించారు. శనివారం ఉదయం9.05 గంటలకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పరిశీలన, శకటాల ప్రదర్శన ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన 300 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
కదిరి టౌన్: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కదిరిలో 1000 అడుగుల జాతీయ పతాకంతో అధికారులు, విద్యార్థులు, యువకులు ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకూ ఉత్సాహంగా సాగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ ర్యాలీలో పాల్గొన్నారు.
రొద్దం: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రొద్దంలో వేయి అడుగుల జాతీయ జెండాను పురవీధుల్లో ప్రదర్శించారు. దొంతి లక్ష్మీనారాయణ తయారు చేసిన వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించాలన్న సంకల్పంతో అతి పెద్ద జాతీయ జెండాను తయారు చేసినట్లు వివరించారు.


