ప్రశాంతి నిలయం: సత్యసాయిని, సర్వదేవతలను స్మరిస్తూ వీణ, పిల్లనగ్రోవితో చక్కటి స్వరాలొలికిస్తూ నిర్వహించిన వాయిద్య కచేరీ శ్రవణానందకరంగా సాగింది. ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. శనివారం సత్యసాయి సన్నిధిలో సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తొలుత బాలవికాస్ చిన్నారులు సత్యసాయి సర్వ ధర్మాలను ప్రదర్శించే ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రముఖ వీణా వాయిద్య విద్వాంసురాలు దీప్తి ప్రసాద్, ప్లూట్ వాయిద్యకారుడు దుర్గా ప్రసాద్ బృందం వీణా, ప్లూట్ వాయిద్య కచేరీ నిర్వహించారు. ‘శ్రీ సత్యసాయి వీణ సుధ’ పేరుతో నిర్వహించిన సంగీత కచేరీతో భక్తకోటి పరవశించి పోయింది. కళాకారులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు దంపతులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


