● హక్కుల కోసం విజయవాడలో
గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు
అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నా చౌక్లో శనివారం నిర్వహించిన సభకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక ఆంక్షలు దాటుకుని వెళ్లారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. సభకు వెళ్లరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టి వారు తరలకుండా అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది. అయినా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన డ్యూటీ చార్ట్ రూపొందించాలని ఉమ్మడి జిల్లా సచివాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదనపు పనులతో ఒత్తిడి పెంచరాదని స్పష్టం చేసింది. పదోన్నతులకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. ప్రభుత్వం అందించే సేవల్లో తాము ముందు వరుసలో ఉంటామని, అలాగే తమ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
టికెట్ లేకుండా ప్రయాణం.. రూ.1.63 లక్షల జరిమానా
గుంతకల్లు: ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారిపై కమర్షియల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ధనుంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో 18 మంది సిబ్బంది దాడులు చేపట్టారు. గుంతకల్లు–కడప–రేణిగుంట మధ్య నడుస్తున్న 14 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు 260 మందిని గుర్తించి రూ.1,63,750 జరిమానా వసూలు చేశారు.
టీబీ డ్యాంలో
72 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: ఉమ్మడి అనంతపురానికి వరప్రదాయినిగా ఉన్న హొస్పేట్లోని తుంగభద్ర జలాశయంలో 72.264 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. అయితే జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, అగుంబే, శృంగేరి, చిక్మంగళూరు, వరనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం 1,00,750 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో తగ్గుతూ వస్తూ శనివారం నాటికి 42,114 క్యూసెక్కులకు చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 1,633 అడుగులుకాగా, ప్రస్తుతం 1,623.68 అడుగల మేర నీటిమట్టం ఉంది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 72.264 టీంఎసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ప్లో 42,114 క్యూసెక్కులుండగా, అవుట్ఫ్లో 1,514 క్యూసెక్కులు కొనసాగుతోందన్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండేది.


