ధర్మవరం అర్బన్: ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అత్యవసర సమయంలో ఆటోపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో సమగ్ర వివరాలతో పాటు డ్రైవర్ నంబర్ కూడా తెలుస్తుందన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అందించారు. కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పోలీసుశాఖ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలు, చిన్నారులు ఆటోలో ప్రయాణించేందుకు భద్రత దృష్ట్యా విముఖత వ్యక్తం చేస్తున్నారని, దీంతో నిజాయితీగా సేవలందిస్తున్న ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం పడుతోందన్నారు. ప్రయాణికుల్లో నమ్మకం కలిగించేందుకే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆటో యజమాని, డ్రైవర్కు సంబంధించిన వివరాలను ప్రయాణికులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్రాజు, ఆర్డీఓ రాంభూపాల్రెడ్డి, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఆటోలకు క్యూఆర్ కోడ్లు అందజేసిన
మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్


