● నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు
● ఇంజినీరింగ్ సిబ్బందిని
హెచ్చరించిన కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో పక్కాగా జరగాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ విభాగాల ఇంజినీరింగ్ సిబ్బందిని హెచ్చరించారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన బడి – మన భవిష్యత్తు’ సివిల్ పనుల పురోగతిపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమీక్షించారు. పనుల్లో పురోగతి తక్కువగా ఉండడంతో ఇంజినీరింగ్ అధికారులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ, పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 3వ తేదీ (సోమవారం) మరోసారి సమావేశమై పూర్తి స్థాయిలో సమీక్షిస్తానన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, సమగ్ర శిక్ష ఈఈ జయరాం, పంచాయతీ రాజ్ ఈఈ మురళీమోహన్ తదితరులు పాల్గోన్నారు.
‘ఎన్ఎంఎంఎస్’ దరఖాస్తు రెన్యూవల్ చేసుకోండి
పుట్టపర్తి: నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఇప్పటికే ఎంపికైన విద్యార్థులు (2022, 2023, 2024 సంవత్సరాల్లో) తమ దరఖాస్తును ఈనెల 31వ తేదీలోపు రెన్యూవల్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారి లాజరు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థులు ప్రస్తుతం 10, 11, 12 తరగతులు చదువుతుంటారని, వారంతా సంబంధిత విద్యాలయం నోడలాఫీసర్ ద్వారా దరఖాస్తును అప్రూవ్ చేయించుకోవాలన్నారు. అనంతరం రెన్యూవల్ దరఖాస్తు జిరాక్స్ పత్రాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. లేకుంటే స్కాలర్ షిప్ మంజూరు కాదన్నారు. ప్రతి విద్యార్థి తన ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతాను సీడింగ్ చేయించి.. డీబీటీ ద్వారా డబ్బు జమ అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.scholarships.gov.in వెబ్సైట్నుసందర్శించాలన్నారు.
‘కియా’లో జాబ్మేళా
ప్రశాంతి నిలయం: పెనుకొండ వద్ద ఉన్న ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 3, 4 తేదీల్లో జాబ్మేళా నిర్వహించనున్నారు. అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిప్లొమా, బీటెక్, పీజీ చదివి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. అయితే వారు కౌశలం పోర్టల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలన్నారు. జాబ్మేళాలలో పాల్గొనాలనుకునే వారు విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఒరిజినల్, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9876543210 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


