హిందూపురం: ముదిరెడ్డిపల్లి వెలసిన రుక్మిణీ పాండురంగ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తొలి ఏకదశిని పురస్కరించుకుని రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం మూలవిరాట్ పాండురంగస్వామికి పంచామృతాభిషేకాలతో విశేష అలంకరణలు చేశారు. అలాగే రుక్మిణీ పాండురంగస్వామికి మడుగుతేరు, మండల పూజ, నవగ్రహ, మృత్యుంజయ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం రథం ఎదుట పూజలు నిర్వహించి మేళతాళాలతో లక్ష్మీ సమేత పాండురంగస్వామి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించి రథంలో కొలువుదీర్చారు. వేదపండితుల పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. భారీగా హాజరైన భక్తులు రథం లాగేందుకు పోటీపడ్డారు. సాయంత్రం హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ జయప్ప, పల్లా లక్ష్మీకుమార్, రామాంజనేయులు, బాలాజీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


