● ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరురూరల్: ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. 2010 సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో చేరిన సీనియర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సర్వీసులో ఉన్నవారికి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ 20 నుంచి 30 సంవత్సరాల క్రితం ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయాలని కోరడం సరైన విధానం కాదన్నారు. సీనియర్లకు మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్లోనూ సీనియర్లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక టెట్లో ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)ను సవరించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టు సిలబస్ నుంచే ప్రశ్నలను రూపొందించి పరీక్ష జరపాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్ఫికర్ అలీ, బాలాత్రిపుర సుందరి, రియాజ్, పిచ్చిబాబు, కరీం మొహిద్దీన్, ఖాదర్బాషా, మహేంద్రరెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్రెడ్డి, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.


