● బల్కర్లతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు) : కూటమి ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. ముత్తుకూరు మండలం పైనాపురం, బ్రహ్మదేవం, ముత్తుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణిని పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. బల్కర్లతో తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్వేపల్లిలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ముత్తుకూరు మీదుగా బల్కర్లు వెళ్లేందుకు వీల్లేదని టీడీపీ నాయకులే డ్రామాలాడి ఇప్పుడు టన్నుకు రూ.50 వంతున బేరమాడి రూ.40కు రాజీ కుదుర్చుకుని సోమిరెడ్డికు అందజేస్తూ పచ్చజెండా ఊపారని ఆరోపించారు. బల్కర్లను ఆపినట్లు ఆపి తిరిగి ముత్తుకూరు మీదుగా నడిపించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ ధర్నాలు చేయడం, బూడిద బల్కర్ల వద్ద బేరం కుదుర్చుకోవడం, ఇందుకు పోలీసులు సహకరించడంపై కాకాణి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో సోమిరెడ్డి కొడుకు, అల్లుడు కూడా ఉన్నారని, వారికి కూడా వాటాలు అందుతున్నాయని ఆయన ఆరోపించారు.
పంచాయతీలను గాలికొదిలేశారు
గ్రామ పంచాయతీలను గాలికొదిలేసి కూటమి నాయకులు నిధులను బొక్కుతున్నారని కాకాణి ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వీధి దీపాలు, మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పైనాపురంలో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సోమిరెడ్డి అతి సమీపంలో యాష్పాండ్ను ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని తొలగించి తన తప్పును సరిదిద్దుకుంటానని హామీ ఇచ్చి తుంగలో తొక్కారాని విమర్శించారు. పరిశ్రమలకు చెందని సీఎస్సార్ నిధులను కలెక్టర్ ద్వారా విడుదల చేసి సర్వేపల్లి అభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. అయితే సోమిరెడ్డి తానే సోలార్ లైట్లను బిగించి వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యనే ఉంటానని, స్వార్ధ ప్రయోజనాల కోసం పాకులాడే నాయకుడిని కాదన్నారు.


