● భక్తుల నామస్మరణల మధ్య గ్రామోత్సవం
● నేత్రపర్వంగా హంస వాహనసేవ
వెంకటాచలం: గొలగమూడి వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాల్లో భాగంగా గురువారం వృషభ వాహనసేవ వైభవంగా జరిగింది. ఉదయం ఆశ్రమంలో పూజల అనంతరం స్వామిని ప్రత్యేక పూలతో అలంకరించి వృషభ వాహనంపై కొలువుదీర్చారు. భక్తులు వాహనాన్ని భుజాలపై మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం ట్రాక్టర్పై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య గ్రామోత్సవం ఘనంగా సాగింది. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సేవకు ఇందుకూరుపేటకు చెందిన సూదలగుంట నాగార్జునరావు, ప్రేమలత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
● ఆరాధనోత్సవాల్లో భాగంగా రాత్రి హంసవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. హంస వాహనంపై స్వామిని ఆశీనులను చేసి పూలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో గొలగమూడి భక్తులతో కోలాహలంగా మారింది. ఈ సేవకు మోచర్ల మధు (ఈదూరు), ఉప్పల మోహన్ (వరిగొండ), నల్లగుండ్ల గాంధీ (తెల్లపాడు) ఉభయకర్తలుగా వ్యవహరించారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
● ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చినశేష వాహనసేవ, రాత్రి గజ వాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.


