● పట్టించుకోని అధికారులు
ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని పంటపాళెం గిరిజనుల సీజేఎఫ్ఎస్ భూముల నుంచి మట్టి అక్రమ తరలింపు ఆగడం లేదు. మట్టి అక్రమ దందాపై సోషల్ మీడియా, పత్రికల్లో కథనాలు బుధ, గురువారాల్లో ప్రచురితమైనా, అక్రమార్కులు ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు. ఆ పరిసరాలకు సైతం అధికారులు వెళ్లకపోవడంతో మట్టి మాఫియా గురువారం చెలరేగిపోయి టిప్పర్ల సంఖ్యను పెంచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలకు ట్రిప్పును రూ.12 వేల వంతున తోలుతున్నారు. సీజేఎఫ్ఎస్ భూములు 16 ఎకరాలుండగా, అందులో నాలుగెకరాల్లో పెద్ద గుంతలను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. వీటిని సాగుకు పనికిరాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో సమీపంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వాపోతున్నారు.


