నెల్లూరు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రిలే దీక్షలను గురువారం నుంచి ఈ నెల తొమ్మిది వరకు నిర్వహించనున్నామని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్సీ సెంటర్లో నిర్వహించనున్న దీక్షలకు మేధావులు, యువత, విద్యార్థులు భాగస్వాములు కానున్నారని వివరించారు. జెన్ జీ పోరాటానికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 77,394 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,129 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.09 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
పోరాట యోధుడు పముజుల
నెల్లూరు(వేదాయపాళెం): పోరాట యోధుడు పముజుల దశరథరామయ్య అని.. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం పోరాటాలు చేశారని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్మోపూరులో పముజుల సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడారు. పముజుల తన 21వ ఏటే సౌత్మోపూరు సర్పంచ్గా ఎన్నికై తన సుదీర్ఘ పాలనలో గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమంగా తీర్చిదిద్దారని కొనియాడారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి రామరాజు, సీపీఎం మాజీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నేతలు మాచర్ల మోహన్రావు, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వినోదిని పాల్గొన్నారు.
పేట్రేగిపోయిన
గంజాయి ముఠా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న గంజాయి ముఠా మరోసారి పేట్రేగిపోయింది. వివరాలు.. జనార్దన్రెడ్డి కాలనీకి వెళ్లేందుకు గానూ వెంకటేశ్వరపురం సెంటర్లో ఓ యువకుడు బుధవారం రాత్రి నిరీక్షించసాగారు. ఈ క్రమంలో గంజాయి సేవించిన ముగ్గు రు యువకులు ఆయన్ను విచక్షణరహితంగా కొ ట్టి సెల్ఫోన్, నగదును దోచుకెళ్లారు. ఈ తతంగా న్ని చూస్తున్న స్థానికులు వారిని ఎదిరించే సాహ సం చేయలేక ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
ప్రశాంతంగా టెట్
నెల్లూరు (టౌన్): ఏపీ టెట్ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 920 మందికి గానూ 869 మంది హాజరయ్యారు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించారు. పొట్టేపాళెం సమీపంలోని జై రామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్స్ కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ 57 మంది దివ్యాంగ అభ్యర్థులను కేటాయించారు. మూడో అంతస్తు వరకు వెళ్లేందుకు లిఫ్టులేక వీరు ఇబ్బంది పడ్డారు. దీనిపై బీటీఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పల్లం వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి గ్రౌండ్ ఫ్లోర్ లేదా లిఫ్ట్ ఉన్న కేంద్రాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఈఓ బాలాజీరావు పరిశీలించారు.


