● మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ దారుణం
● బహిరంగ చర్చకు సోమిరెడ్డి రావాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
పొదలకూరు: కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని మహ్మదాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. కాకాణిని రైతులు, ముస్లిం నేతలు కలిసి ముస్తఫా అరెస్ట్ను తీవ్రంగా తప్పుబట్టారు. ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చెరువు కట్ట పటిష్టత పేరుతో గ్రావెల్ను తోలకుండా పక్కనే ఉన్న మట్టిని తరలించి బిల్లులు చేసుకుంటున్నారని నల్లపాళెం గ్రామస్తులు తెలిపారు.
టీడీపీ నేతలకే ఉపాధి హామీ
ఉపాధి హామీ పథకం టీడీపీ నేతలకే పరిమితమైందని కాకాణి ఆరోపించారు. రెండేళ్ల నమ్మకం కార్యక్రమానికి ప్రజలు రావడంలేదని విమర్శించారు. ముస్లింలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న అరాచకాలకు నిదర్శనమే ముస్తఫా అరెస్ట్ అని మండిపడ్డారు. కూటమిని కూల్చేందుకు వీరందరూ ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మసీదు కమిటీలను రద్దు చేసి.. లోపభూయిష్టంగా తిరిగి ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఇరిగేషన్లో దొంగ బిల్లులు
రైతులకు సాఫీగా సాగునీటిని అందించేందుకు రూ.కోట్ల పనులు మంజూరు చేయించుకొని, వర్కులు చేయకుండానే సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సోమిరెడ్డి దోపిడీని చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారని.. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోపిడీపై బహిరంగ చర్చకు ఆహ్వానిస్తే, సోమిరెడ్డి రావడంలేదని విమర్శించారు. పిలిచిన ప్రతిసారి పలాయనం చిత్తగిస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పనులు టీడీపీ శ్రేణులకు కాసులు కురిపిస్తున్నాయని తెలిపారు. యంత్రాలతో వర్కులు చేయిస్తూ, పాత పనులకు జేసీబీతో ౖపైపెన మట్టిని లోడి మస్తర్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పారు. పనులను కల్పించకపోవడంతో పేదలు పస్తులుంటున్నారని, అయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని చెప్పారు. గ్రామానికి చెందిన చల్లా ఇందిరమ్మ దశదిన కర్మకు హాజరై నివాళుర్పించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్కుమార్రెడ్డి, గడ్డం తిరుపాల్రెడ్డి, మాల్యాద్రిరెడ్డి, రమణారెడ్డి, పుచ్చా చెంచుకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


