● రెండేళ్ల బాలుడికి లివర్ కేన్సర్
● దాతల సాయం కోసం ఎదురుచూపు
ఉదయగిరి రూరల్: వారిది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. బాలుడికి ఆరోగ్య సమస్య రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఉదయగిరి మండలంలోని కృష్ణంపల్లి గ్రామానికి చెందిన తుపాకుల మహేష్, మంజుల దంపతులకు అన్విత్, తన్విష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. మహేష్ బేల్దారి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమారుడైన రెండేళ్ల వయసున్న తన్విష్ మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం సోకి పొట్ట ఉబ్బిపోవడంతో ఆహారం తీసుకోలేని పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్లకు తీసుకెళ్లారు. అయితే ఫలితం లేకపోవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. డాక్టర్లు లివర్ కేన్సర్గా గుర్తించి మరో వైద్యశాలకు సిఫార్సు చేశారు. అక్కడ చిన్నారికి వైద్యం చేసే సదుపాయం లేకపోవడంతో చైన్నెకి పంపించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి కీమో థెరపీ పరీక్షలు చేసి కడుపులో ఉన్న గడ్డ సైజును తగ్గించారు. అనంతరం చిన్నారికి లివర్తోపాటు, ఊపిరితిత్తులు, గుండెకు కేన్సర్ సోకిందని, దీని నివారణకు మూడు శస్త్రచికిత్సలు చేయాలన్నారు. అందుకు రూ.40 లక్షలు ఖర్చవుతుందని తల్లిదండ్రులకు తెలిపారు. ఇప్పటికే వారికి ఉన్న పొలం, ఇల్లు తాకట్టు పెట్టి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. తన్విష్ కు వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 89859 61236


