నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2,421 ప్రభుత్వ పాఠశాలల్లో 1,59,059 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో బడుల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులతో సమావేశమై గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక, తుది ఫలితాలపై చర్చిస్తామన్నారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజనంతో ముగించాలన్నారు. సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, సీఎంఓ రమణయ్య, ఏఎంఓ పెంచలయ్య పాల్గొన్నారు.


