నెల్లూరు (దర్గామిట్ట): దగదర్తి తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూముల రక్షణలో కీలకపాత్ర పోషించాల్సిన అధికారులే రికార్డులను మాయం చేస్తూ.. ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వకార్ యూనిస్ మైన్స్ అండ్ మినరల్స్కు కేటాయించిన ల్యాండ్స్ విషయంలో జరిగిన లావాదేవీలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జిల్లాలో గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి వద్ద ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకొని, కార్యాలయంలో ఓ అధికారి చక్రం తిప్పుతున్నారు. అప్పటి తహసీల్దార్ హయాంలో జరిగిన తప్పులు బయటపడకుండా ఉండేందుకు గానూ రోజూ తన ప్రైవేట్ వాహనంలో కార్యాలయ ఫైళ్లను బయటకు తీసుకెళ్లి, రికార్డులను మార్చి తిరిగి తెస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉలవపాళ్ల రికార్డుల గల్లంతు వెనుకా ఈ అధికారి హస్తం ఉందని సమాచారం.
విమానాశ్రయ భూసేకరణలో బాధితులను ఈ అధికారి నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. కావలిలోని ఓ విశ్రాంత ఉద్యోగితో కుమ్మకై ్క, బాధితులకు అందాల్సిన పరిహార విష యంలో కొర్రీలేస్తూ రూ.లక్షలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్తేనే మీకు పరిహారమొస్తుందని, లేని పక్షంలో ఊరుకోవాల్సిందేనంటూ కేకేగుంట, దామవరం గ్రామస్తులను బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
సిబ్బందిపై రుసరుసలు
కార్యాలయంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు పత్రికలకు ఎలా చేరుతున్నాయంటూ సహచర సిబ్బందిపై సదరు అధికారి విరుచుకుపడుతున్నారు. నేనెళ్లేటప్పుడు సమూలంగా నాశనం చేసి.. అందరి అంతు చూస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతుండటంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి సదరు అధికారిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రికార్డులు మాయం..?
మధ్యవర్తిత్వం వహించిన అధికారిపై ఆరోపణల వెల్లువ
విమానాశ్రయ బాధితులపైనా
బెదిరింపులు
మైనింగ్ భూముల క్రమబద్ధీకరణకు రూ.ఎనిమిది లక్షల డిమాండ్
దగదర్తిలో ఇదీ పరిస్థితి
ఎయిర్పోర్టు నిర్వాసితులనూ వదల్లేదు..
పలుకుబడిని అడ్డం పెట్టుకొని..


