అస్సాం పోలింగ్కు యూపీనుంచి 50వేలమంది తరలించారు
బెంగాల్లోనే ఇదే పన్నాగాలు పన్నుతున్నారు
అయినా బీజేపీ ఎత్తులు పారవు, ప్రజలు తమకే పట్టం కడతారు : మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.
బీజేపీపై ఘాటు విమర్శలు
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు. పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు.
ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎస్ఐఆర్ వివాదం
పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్ ప్రజలపై నమ్మకం ఉందన్నారు.
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి మాట్లాడాలన్నారు.
(నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)


