రాష్ట్రంలో పాలు, నీరు, ఆహారం కల్తీ
● పసిబిడ్డలపై లైంగిక దాడులు
● ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యాలు
● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్
నెల్లూరు(అర్బన్): ‘రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా కల్తీ రాజ్యమేలుతోంది. పాలు, నీరు, ఆహారాన్ని కొందరు కల్తీ చేస్తుండటంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. నెల్లూరుకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మేల్కోవాలంటూ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. బాబు పాలనలో మంచినీరు, పాలు, లడ్డూ కలుషితమయ్యాయని ఆరోపించారు. పసిబిడ్డలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిమిషానికి ఐదుగురిపై లైంగికదాడులు జరుగుతున్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చిందన్నారు. విశాఖపట్నంలో దళితులకు ఏనాడో ప్రభుత్వమిచ్చిన 50 ఎకరాలను ఒక ఎమ్మెల్యే గ్రావెల్, ఇసుక కోసమంటూ వారిని అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వస్తాయో రావో తెలియదన్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్న ఓ నేతకు నెలనెలా మామూళ్లు వెళ్తాయన్నారు. ఆలస్యమైతే సదరు నేత అందర్నీ బెదిరిస్తూ హంగామా చేస్తారని ఆరోపించారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్ర లేదని చెప్తూ.. టీటీడీదే తప్పు అన్నట్టు మాట్లాడారన్నారు. సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా, చంద్రబాబు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి హెరిటేజ్కు్ ఉన్న లింకు ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే తెల్లారే సరికే తమ శ్రేణులపై పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయినా తాము భయపడేదిలేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, అక్రమ కేసులు ఆపాలంటూ తాము గవర్నర్నను కలవనున్నామన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడికి జన ప్రభంజనం వస్తోందన్నారు. ఈ విషయాన్ని తట్టుకోలేని చంద్రబాబు అర్ధగంటలో చేయాల్సిన ప్రయాణం ఆరు గంటలు పట్టిందా అంటూ అసెంబ్లీలో మాట్లాడటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు తప్పుబడుతున్నారన్నారు. మీరెలా గెలిచారో పరకాల ప్రభాకర్ వీడియోలు చూస్తేనే అర్థమవుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. అవినీతి అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. సమావేశంలో నేతలు స్వర్ణా వెంకయ్య, ఏసునాయుడు తదితరులు పాల్గొన్నారు.


