హక్కుల సాధన కోసం పోరుబాట
● పీఆర్సీ, డీఏ, అరియర్స్ కోసం
ఆందోళనలు
● ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు
నెల్లూరు(అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఆర్టీసీ, పెన్షనర్ల, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు పోరుబాట పట్టనున్నట్టు ఏపీ జేఏసీ నూతన కార్యవర్గం ప్రకటించింది. ఆదివారం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు చెందిన పలు సంఘాలకు చెందిన నేతలతో సమావేశం జరిగింది. నూతన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లును చైర్మన్గా, జనరల్ సెక్రటరీగా ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి నియమితులయ్యారు. 32 మందితో జేఏసీ కమిటీ ఏర్పడింది. ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
● వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు 32 శాతం మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. తగ్గించబడిన హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలని, నిరుపయోగంగా ఉన్న ఈహెచ్ఎస్ స్థానంలో క్యాష్లెస్ వైద్య చికిత్సలు పొందే నూతన విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ మెమో 57 పరిధిలోకి వచ్చే ఉద్యోగులను ఓపీఎస్ పెన్షన్ పరిధిలోనికి తీసుకురావాలన్నారు. ఉద్యోగ, పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో నూతన జేఏసీ కో చైర్మన్లు మురళీమోహన్రెడ్డి, చలపతిశర్మ, కిరణ్కుమార్, సుదర్శన్, లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్, మార్కండేయులు, కార్యదర్శి సురేంద్రరెడ్డి, జాయింట్ సెక్రటరీలు సురేష్బాబు, దశరథరామయ్య, పెంచలయ్య, శ్రీనివాసరావు, కుమార్, శ్రీధర్ చౌదరి, నిర్వహణా కా ర్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వీఎమ్వీ ప్రసాద్రెడ్డి, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.


