నిత్యం పడిగాపులే..
● రోజూ ఆర్టీసీ బస్టాండ్లో
700 పార్శిల్ బుకింగ్లు
● రెండు కేంద్రాలతో నెట్టుకొస్తున్న
అధికారులు
● గంటల తరబడి వేచిచూస్తున్న
వినియోగదారులు
నెల్లూరు సిటీ: ‘ఆర్టీసీలో పార్శిల్ బుకింగ్ చేసుకుంటే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాం. సంస్థ ఆదాయం పెంపునకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలి’ నిత్యం అధికారులు చెప్పే మాటలివి. అయితే ఇవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వినియోగదారులు పార్శిల్ బుకింగ్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోజూ ఇలా..
జిల్లాలోని 7 డిపోల్లో మొత్తం 34 పార్శిల్ సర్వీసు కేంద్రాలున్నాయి. నెల్లూరు నగరంలోని డిపో 1లో (ప్రధాన బస్టాండ్) రెండు, డిపో 2లో (ఆత్మకూరు బస్టాండ్) ఒకటి ఉన్నాయి. డిపో 1లో 600 నుంచి 700 పార్శిల్స్ రోజూ బుకింగ్ అవుతుంటాయి. డిపో 2లో ఈ సంఖ్య చాలా తక్కువ. సాయంత్రం సమయంలో ప్రధాన బస్టాండ్లో ఆర్టీసీ కార్గో కేంద్రం వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తుంటారు. డిపో 1 నుంచి కార్గో ద్వారా రోజూ రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల రాబడి వస్తుంది. అదే జిల్లా మొత్తం నుంచి అయితే రోజుకు రూ.3 లక్షల వరకు ఆదాయం ఉంది.
రెండు బుకింగ్ కేంద్రాలతోనే..
ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో వందల సంఖ్యలో రోజూ పార్శిల్ బుకింగ్లు జరుగుతున్నాయి. అయితే చాలాకాలంగా రెండు కేంద్రాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ అవుట్ సోర్సింగ్ కింద సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అధికారులు కేంద్రాలు పెంచకపోవడం, ఆ సంస్థ తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
కేంద్రాలు పెంచే ఆలోచనలో ఉన్నాం
బుకింగ్ కేంద్రాలు సరిపోలేదని ఫిర్యాదులొచ్చాయి. త్వరలో ఒకటి లేదా రెండు కేంద్రాలు పెంచే ఆలోచనలో ఉన్నాం. ప్రయాణికులు, పార్శిల్ సర్వీస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించడం మా బాధ్యత.
– షేక్ షమీమ్,
జిల్లా ప్రజా రవాణా అధికారిణి
నిత్యం పడిగాపులే..
నిత్యం పడిగాపులే..
నిత్యం పడిగాపులే..


