ఈరోజు సెలవు.. రేపొచ్చి ఫిర్యాదు ఇవ్వండి
● మట్టి అక్రమ తరలింపుపై అధికారుల తీరు
సైదాపురం: చెరువులో మట్టిని ఇతర ప్రాంతాలకు టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఈరోజు సెలవు, రేపొచ్చి ఇదే ఫిర్యాదు ఇవ్వండి. అప్పడు తీసుకుంటాం’ అని చెప్పారు. మండలంలోని మర్లపూడి చెరువు సమీపంలో ఉన్న మట్టిని ఆదివారం బహిరంగంగానే జేసీబీతో తవ్వి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా రేపు అర్జీ ఇవ్వండి.. అప్పడు చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వి బహిరంగంగానే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ఏ అధికారి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


