
తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్లో విజేతగా నిలవడం ద్వారా మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా టీమ్ చరిత్ర పుటల్లోకెక్కిన విషయం తెలిసిందే. జట్టుగా ఆసీస్ ఈ రికార్డు సాధించగా.. వ్యక్తిగతంగా ఐదుగురు ఆటగాళ్లు కూడా ఈ ఘనత సాధించారు.
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లు మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ (2015 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్, 2023 డబ్ల్యూటీసీ) గెలిచిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు. ఈ ఐదుగురు వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్, డబ్ల్యూటీసీ టైటిల్స్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో ఈ ఐదుగరు మినహా మరెవ్వరూ ఈ ఘనత సాధించలేకపోయారు.
ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు