చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్పై విజయం
12 పాయింట్లతో ‘టాప్’గా నిలిచి నేరుగా ఫైనల్కు
గ్రేస్ హారిస్, స్మృతి మెరుపులు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ పోరుకు చేరింది. వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందుగా ‘ప్లే ఆఫ్స్’ చేరిన ఆర్సీబీ జట్టు ఆపై రెండు ఓటములు ఎదుర్కొంది.
అయితే చివరి పోరులో మళ్లీ సత్తా చాటి యూపీ వారియర్స్ని చిత్తు చేసింది. 12 పాయింట్లతో ‘టాప్’గా నిలిచిన స్మృతి మంధాన బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్కు ‘జిరాక్స్’ తరహాలోనే దాదాపు ఈ మ్యాచ్ సాగింది... యూపీ గత మ్యాచ్లాగే సరిగ్గా 143 పరుగులే చేయగా, ఛేదనలో గ్రేస్ హారిస్ దాదాపు ఒకే తరహాలో 200కు పైగా స్ట్రయిక్రేట్తో ఒంటి చేత్తో గెలిపించింది.
నాడు 47 బంతులు మిగిలి ఉండగా నెగ్గిన ఆర్సీబీ ఈసారి 41 బంతుల ముందు లక్ష్యాన్ని ఛేదించింది. స్కోర్లు సమమైన చోట వికెట్ పడకుండా ఉంటే గెలుపు అంతరం కూడా ఒకేలా ఉండేది! ఈ పరాజయంతో యూపీ వారియర్స్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది.
వడోదర: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్లో 2024 విజేత ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై నెగ్గింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ మెగ్ లానింగ్ (30 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది.
నదైన్ డిక్లెర్క్ (4/22) నాలుగు వికెట్లతో యూపీని దెబ్బ తీసింది. అనంతరం బెంగళూరు 13.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (37 బంతుల్లో 75; 13 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగింది. హారిస్, స్మృతి మంధాన (27 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి తొలి వికెట్కు 55 బంతుల్లోనే 108 పరుగులు జత చేశారు.
రాణించిన ఓపెనర్లు
అనూహ్యంగా తొలిసారి ఓపెనర్గా బ్యాటింగ్కు దిగిన దీప్తి, కెప్టెన్ లానింగ్ కలిసి జట్టుకు శుభారంభం అందించారు. పవర్ప్లే ముగిసేసరికి యూపీ వికెట్ నష్టపోకుండా 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50 పరుగులు సాధించింది. అయితే 9వ ఓవర్ నుంచి ఆట మారిపోయింది. తన తొలి బంతికే లానింగ్ను అవుట్ చేసిన డిక్లెర్క్, ఐదో బంతికి ఎమీ జోన్స్ (1)ను పెవిలియన్ పంపించింది.
ఆ తర్వాత తక్కువ వ్యవధిలో హర్లీన్ (14), ట్రయాన్ (6), శ్వేత సెహ్రావత్ (7) వెనుదిరగ్గా... మరో ఎండ్లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన దీప్తి 18వ ఓవర్ చివరి బంతికి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన వారియర్స్ తర్వాతి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే సాధించింది.
హారిస్ దూకుడు
యూపీతో ఆడిన గత మ్యాచ్లో 40 బంతుల్లోనే 85 పరుగులు చేసిన హారిస్... ఈసారి కూడా సరిగ్గా అంతే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అదే తరహాలో బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్లో బౌండరీల ద్వారా 70 పరుగులు రాబట్టిన ఆమె ఈసారి బౌండరీలతో 64 పరుగులు సాధించింది!
పవర్ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, హారిస్ వాటానే 49 పరుగులు కావడం విశేషం. ఆ తర్వాత శోభన ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఆమె 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. ఎట్టకేలకు ఆర్సీబీ విజయానికి 36 పరుగులు చేయాల్సిన దశలో హారిస్ను అవుట్ చేయగలిగినా ...స్మృతి 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి మ్యాచ్ను ముగించింది.
స్కోరు వివరాలు
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 41; దీప్తి (సి) డిక్లెర్క్ (బి) శ్రేయాంక 55; జోన్స్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 1; హర్లీన్ (బి) హారిస్ 14; ట్రయాన్ (స్టంప్డ్) రిచా (బి) హారిస్ 6; శ్వేత (సి) స్మృతి (బి) బెల్ 7; సిమ్రన్ (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 10; ఎకెల్స్టోన్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 0; శోభన (నాటౌట్) 0; శిఖా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–95, 4–103, 5–122, 6–137, 7–138, 8–143. బౌలింగ్: బెల్ 4–0–21–1, సయాలీ 2–0–21–0, శ్రేయాంక 4–0–27–1, అరుంధతి 1–0–14–0, డిక్లెర్క్ 4–0–22–4, హారిస్ 3–0–22–2, రాధ 2–0–11–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) శిఖా 75; స్మృతి (నాటౌట్) 54; వోల్ (సి) సిమ్రన్ (బి) శోభన 16; రిచా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో 2 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–108, 2–143. బౌలింగ్: క్రాంతి 2–0–29–0, శిఖా 4–0–36–1, దీప్తి 2.1–28–0, ఎకెల్స్టోన్ 2–0–14–0, శోభన 2–0–24–1, ట్రయాన్ 1–0–15–0.
డబ్ల్యూపీఎల్లో నేడు
ముంబై ఇండియన్స్ x గుజరాత్ జెయింట్స్
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం


