వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జమ్మూ కాశ్మీర్ స్పీడ్స్టార్ ఆకిబ్ నబీకి చోటు దక్కిన సంగతి తెలిసిందే. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఫ్రంట్ లైన్ పేసర్లు ఆసియా క్రీడల కోసం జపాన్ వెళ్లనుండటంతో నబీకి తొలిసారి భారత వన్డే జట్టులో అవకాశం లభించింది.
29 ఏళ్ల నబీ.. స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కలిసి బౌలింగ్ పంచుకోనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులో నబీ పేరు చూసి తాను ఒకింత ఆశ్చర్యపోయానని జాఫర్ చెప్పుకొచ్చాడు.
"వైట్బాల్ క్రికెట్లో నబీకి అంతగా మంచి రికార్డు లేకపోయినా, విండీస్తో జరిగే వన్డేలకు అతడిని ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఒక ఆటగాడికి దక్కే గొప్ప గౌరవం. నబీ తనకు లభించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను.
కానీ ఈ వన్డే జట్టులో చోటు దక్కిందనే కారణంతో అతడు న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు పక్కన పెట్టకూడదు. ఈ సిరీస్లో అతడు విఫలమైనా కివీస్ టూర్కు అతడిని కచ్చితంగా ఎంపిక చేయాలి. అతడు రెడ్బాల్తో అద్భుతాలు చేయగలడు.
అయితే ప్రస్తుతానికి వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో నబీ ఉన్నాడని నేను అనుకోవడం లేదు. కానీ విండీస్ సిరీస్లో గనుక అతడు అద్భుతంగా రాణిస్తే, ప్రపంచకప్ జట్టు రేసులోకి వచ్చే అవకాశం ఉంటుంది" అని జాఫర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా నబీ ఇప్పటివరకు 36 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 56 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: అతడి కోసం వీవీఎస్ లక్ష్మణ్, గంభీర్-గిల్ పట్టు.. ఎవరి మాట నెగ్గిందంటే?


