సాక్షి ప్రతినిధి, కడప: కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)–2026 సీజన్–5 తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై విజయవాడ సన్షైనర్స్ విజయం సాధించింది. టాస్ వేయడానికి బీసీసీఐ అపెక్స్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ గెలిచిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
కడపకు చెందిన జహీర్ అబ్బాస్ విజయవాడ తరఫున రంగంలోకి దిగి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో జట్టు స్కోరు 198 పరుగులకు చేరింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్, హిమ శ్రీనివాస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తుంగభద్ర వారియర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది.
మరో ఓపెనర్ సమన్యు 24 బంతుల్లో 51 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు), సత్య సూర్యనారాయణ 21 బంతుల్లో 29 పరుగులు (4 ఫోర్లు), చివర్లో సౌరవ్కుమార్ 15 బంతుల్లో 23 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసినా టీంకు విజయాన్ని చేకూర్చలేకపోయారు. విజయవాడ బౌలర్లలో భరత్ 4 వికెట్లు పడగొట్టి తుంగభద్ర జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు.


