కోహ్లి తెచ్చిన కిక్‌... | Unexpected response to Railways vs Delhi Ranji match | Sakshi
Sakshi News home page

కోహ్లి తెచ్చిన కిక్‌...

Jan 31 2025 2:41 AM | Updated on Jan 31 2025 4:04 AM

Unexpected response to Railways vs Delhi Ranji match

రైల్వేస్, ఢిల్లీ రంజీ మ్యాచ్‌కు అనూహ్య స్పందన

బ్రహ్మరథం పట్టిన అభిమానులు

27 వేల మంది ప్రేక్షకుల హాజరు

నేడు బ్యాటింగ్‌ చేయనున్న కోహ్లి  

సాధారణంగా రంజీ మ్యాచ్‌ జరుగుతోందంటే.. వంద మంది ప్రేక్షకులు ఆట చూసేందుకు రావడం కూడా కష్టమైన ఈ రోజుల్లో... గురువారం న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియం (గతంలో ఫిరోజ్‌ షా కోట్లా మైదానం) కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే... ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు రంజీ మ్యాచ్‌ చూసేందుకు పోటెత్తారు. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి 2012 తర్వాత తొలిసారి ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్‌ ఆడుతుండటంతో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 

మ్యాచ్‌ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే క్యూ లైన్లు నిండిపోగా... ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) చేసిన ఏర్పాట్లకు మించి ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. అభిమానులు భారీగా వస్తారని ముందే అంచనా వేసిన డీడీసీఏ... స్టేడియంలోని 6 వేల సామర్థ్యం గల ‘గౌతమ్‌ గంభీర్‌ స్టాండ్‌’ను తెరవగా... కాసేపట్లోనే అది నిండిపోయి స్వల్ప తొక్కిసలాట జరిగింది. 

అదే సమయంలో మైదానం వెలుపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం జరుగుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... 11 వేల సామర్థ్యం గల ‘బిషన్‌ సింగ్‌ బేడీ స్టాండ్‌’లోకి అభిమానులను అనుమతించారు. తొలి రోజు ఏకంగా 27 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం.  

న్యూఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగితే... దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా కళకళలాడు తాయని నిజమైంది. రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా గురువారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది. 2012 తర్వాత భారత దిగ్గజం విరాట్‌ కోహ్లి రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధం కావడమే దీనికి కారణం. కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉదయం నుంచే ఎగబడ్డారు. ఫలితంగా మైదానం అభిమానులతో నిండిపోయింది. 

‘రంజీ ట్రోఫీలో ఇలాంటి సందడి గతంలో ఎప్పుడూ చూడలేదు. దేశవాళీ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి కోసమే. వచ్చిన వాళ్లంతా కోహ్లి నామస్మరణ చేస్తున్నారు’ అని మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ భారత మాజీ క్రికెటర్‌ అన్నాడు. ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్  క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్‌ శర్మ మాట్లాడుతూ... ‘30 ఏళ్లుగా ఢిల్లీ క్రికెట్‌ను గమనిస్తున్నా. రంజీ ట్రోఫీలో ఇలాంటి దృశ్యాలు చూడలేదు. 

కోహ్లి ఆదరణకు ఇది నిదర్శనం. మొదట ఒక గేట్‌ ద్వారానే అభిమానులను అనుమతించాం. తర్వాత పరిస్థితిని బట్టి మైదానంలోని అన్ని గేట్లు తెరిచాం’ అని అన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కెరీర్‌లో చివరగా ఆడిన రంజీ మ్యాచ్‌కు ఇప్పటి వరకు అత్యధికంగా 8 వేల పైచిలుకు మంది అభిమానులు హాజరు కాగా... గురువారం రైల్వేస్‌–ఢిల్లీ మ్యాచ్‌ చూసేందుకు 27 వేల మందికి పైగా ప్రేక్షకులు పోటెత్తారు. 

ఈరోజు క్రీజులోకి రానున్న కోహ్లి 
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెపె్టన్‌ ఆయుశ్‌ బదోనీ ఫీల్డింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నా... అభి మానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ‘గంటలకొద్దీ నిలబడి మైదానంలోకి వచ్చింది... కోహ్లిని చూసేందుకే. అతడు ఫీల్డింగ్‌ చేసినా మాకు ఆనందమే’ అని ప్రేక్షకుల్లోని ఒక గృహిణి పేర్కొనగా... కోహ్లి ఆట చూసేందుకే పాఠశాల నుంచి వచ్చామని పలువురు విద్యార్థులు చెప్పారు. 

రెండో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసిన కోహ్లి... అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయగా... ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కోహ్లి కాళ్లకు నమస్కరించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్‌ (95; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కరణ్‌ శర్మ ( 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. 

ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్, సుమిత్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 41 పరుగులు చేసింది. శుక్రవారం కోహ్లి బ్యాటింగ్‌కు రానున్న నేపథ్యంలో... మరింత మంది అభిమానులు మైదానానికి పోటెత్తడం ఖాయమే!

చదవండి : 2 ప‌రుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే

Advertisement
 
Advertisement
Advertisement