రోహిత్‌ సెంచరీ వృథా.. లార్డ్స్‌ వన్డేలో టీమిండియా ఓటమి | Rohit Sharmas Knock In Vain As England Beat India To Clinch Series 2-1 | Sakshi
Sakshi News home page

IND vs ENG: రోహిత్‌ సెంచరీ వృథా.. లార్డ్స్‌ వన్డేలో టీమిండియా ఓటమి

Jul 20 2026 12:00 AM | Updated on Jul 20 2026 12:22 AM

Rohit Sharmas Knock In Vain As England Beat India To Clinch Series 2-1

PC: BCCI Twitter

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో  3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఓపెనర్ బెన్ డక్కెట్ (141 పరుగులు, 135 బంతుల్లో, 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్, 48 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.

రో-కో హిట్‌.. మిడిలార్డ‌ర్ ఫ‌ట్‌
అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 77 పరుగులు చేసిన గిల్.. రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, రోహిత్‌తో జతకట్టాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రోహిత్ 34 బంతుల్లో తన 34వ వన్డే సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. వరుస బౌండరీలు బాది మంచి జోరు మీద ఉన్న రోహిత్(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) జాకబ్ బెథల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 

రోహిత్ ఔటైన తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. మిడిలార్డర్ బ్యాటర్లు ఒక్కరు కూడా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్‌(14), శ్రేయస్ అయ్యర్‌(0) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో కావాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి(74) కూడా ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో మ్యాచ్ భారత్ చేతులనుంచి చేజారిపోయింది. కేఎల్ రాహుల్‌(12), అక్షర్ పటేల్‌(2) నిరాపరిచారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇం‍గ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. కాగా ఇంగ్లండ్ టూర్‌లో భారత్ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement