విజేత అర్జున్‌... రన్నరప్‌ సరయు | Telangana players in National Junior Chess Championship | Sakshi
Sakshi News home page

విజేత అర్జున్‌... రన్నరప్‌ సరయు

Sep 26 2024 4:00 AM | Updated on Sep 26 2024 4:00 AM

Telangana players in National Junior Chess Championship

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్‌ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆదిరెడ్డి అర్జున్‌ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్‌ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. 

నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్‌ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్‌ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్‌ బిశ్వాస్‌ (పశ్చిమ బెంగాల్‌; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్‌ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. 

బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్‌ (పశ్చిమ బెంగాల్‌)తో కలిసి సంయుక్తంగా టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. 

మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో మృతిక టైటిల్‌ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్‌ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్‌ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement