IND Vs SA 2nd T20: Team India Record First T20I Series Win Against South Africa At Home - Sakshi
Sakshi News home page

IND Vs SA T20 Series: స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర..

Published Mon, Oct 3 2022 9:30 AM

Team India Record First T20I Series Win Against South Africa At Home - Sakshi

స్వదేశంలో సౌతాఫ్రికాపై టి20 సిరీస్‌ గెలవలేదన్న అపవాదును టీమిండియా చెరిపేసింది. ఆదివారం గుహవటి వేదికగా జరిగిన రెండో టి20లో పరుగుల జడివానలో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తద్వారా స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలి టి20 సిరీస్‌ను గెలిచి కొత్త చరిత్ర లిఖించింది.

టి20 సిరీస్‌ల హవా మొదలైన తర్వాత సౌతాఫ్రికా మన గడ్డపై నాలుగుసార్లు పర్యటించింది. తొలిసారి 2015లో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత రెండు సందర్భాల్లో(2019, 2022) సిరీస్‌లు డ్రా అయ్యాయి. ఇక తాజాగా నాలుగోసారి దక్షిణాఫ్రికా నాలుగోసారి టీమిండియా పర్యటనకు రాగా.. ఈసారి మాత్రం భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

టి20 క్రికెట్‌లో డెత్‌ ఓవర్లలో(16 నుంచి 20 ఓవర్లు) రెండు జట్లు కలిపి అత్యధిక పరుగులు చేయడం క్రికెట్‌ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ 82 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 78 పరుగులు చేసింది. ఓవరాల్‌గా డెత్‌ ఓవర్లలో ఇరుజట్లు కలిపి 160 పరుగులు చేయడం విశేషం. ఇంతకముందు  2010లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా కలిపి ఒక మ్యాచ్‌లో డెత్‌ ఓవర్లలో 148 పరుగులు చేయగా.. 2007లో టీమిండియా, ఇంగ్లంఢ్‌లు కలిపి 145 పరుగులు చేశాయి.


ఇక టి20 క్రికెట్‌లో ఒక బ్యాటర్‌ సెంచరీ చేసిన సందర్భంలో తన జట్టు ఓటమిపాలవ్వడం ఇది రెండోసారి మాత్రమే. డేవిడ్‌ మిల్లర్‌(106 నాటౌట్‌) సెంచరీతో మెరిసినప్పటికి సౌతాఫ్రికా 16 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అంతకముందు 2016లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహెల్‌(110 నాటౌట్‌) వెస్టిండీస్‌పై సెంచరీతో మెరిసినప్పటికి ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది.


టీమిండియాతో జరిగిన రెండో టి20లో సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌లు నాలుగో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టి20 క్రికెట్‌లో నాలుగో వికెట్‌ లేదా ఆ తర్వాత నుంచి ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.


ఇక డేవిడ్‌ మిల్లర్‌కు టి20ల్లో ఇది రెండో టి20 సెంచరీ కాగా.. మిల్లర్‌ రెండు స​ందర్భాల్లోనూ ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు బాదాడు. 2017లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 101 పరుగులు చేసిన మిల్లర్‌.. తాజాగా టీమిండియాతో ​మ్యాచ్‌లో 106 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ మిల్లర్‌ నాటౌట్‌గా ఉండడం విశేషం.

Advertisement
Advertisement