Rohit Sharma Says The Way Arshdeep Singh Bowler In The Asia Cup Very Impressive - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: అర్ష్‌దీప్‌పై రోహిత్‌ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! అతడు మాత్రం..

Published Mon, Sep 19 2022 10:58 AM

T20 WC 2022: Rohit Sharma Backs Arshdeep Bowled In Asia Cup Impressive - Sakshi

T20 World Cup 2022- Rohit Sharma- Arshdeep Singh: టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో ఈ యువ బౌలర్‌ బౌలింగ్‌ చేసిన విధానం అమోఘమని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ యార్కర్లు సంధించి ప్రత్యర్థికి చెమటలు పట్టించగల ప్రతిభ అర్ష్‌దీప్‌ సొంతమని ప్రశంసించాడు. 

టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా మంగళవారం ఆరంభం కానున్న తొలి టీ20కి ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఓపెనింగ్‌ జోడీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

అంత తేలికేం కాదు!
ప్రపంచకప్‌ టోర్నీలో కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడని.. విరాట్‌ కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్‌ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఇక అర్ష్‌దీప్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ చేస్తున్న విధానం బాగుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే.. ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగడం మామూలు విషయం కాదు.


అర్ష్‌దీప్‌ సింగ్‌

తను చాలా తెలివైన వాడు. జట్టులో ఎప్పుడైతే లెఫ్టార్మ్‌ సీమర్‌ అవసరం ఎక్కువగా ఉందో అప్పుడే.. ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో ప్రతిభను నిరూపించుకుని టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. అతడి రాకతో మా బౌలింగ్‌ విభాగం పటిష్టమైంది’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇక ఆసియా కప్‌-2022 సూపర్‌- దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అసిఫ్‌ అలీ క్యాచ్‌ నేలపాలు చేసిన కారణంగా అర్ష్‌దీప్‌ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అదే విధంగా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ 3.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. అతడి ఆట తీరుపై విమర్శలు మరింత పెరిగాయి.

అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా..
ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘‘తనకు ఆత్మవిశ్వాస మెండు. చాలా మంది ఆటగాళ్లు ఇంట్లో కూర్చుని ఉన్నా జట్టులో అతడికి చోటు దక్కడానికి కారణం అదే. కెరీర్‌ తొలినాళ్లలోనే అతడు పరిణతితో వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్‌గా నేను.. కోచ్‌ ద్రవిడ్‌ భాయ్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌తో చాలా సంతృప్తిగా ఉన్నాము’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ జట్టులో 23 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో సిరీస్‌లో మాత్రం అతడికి విశ్రాంతి దొరికింది.

చదవండి: Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..

Advertisement
Advertisement