స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.
తిప్పేసిన హసరంగ
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది.
పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది.


