Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి! | Special news about young player Vaibhav Suryavanshi | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!

Apr 30 2025 4:06 AM | Updated on Apr 30 2025 8:45 AM

Special news about young player Vaibhav Suryavanshi

వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం

క్రమశిక్షణ ముఖ్యమంటున్న విశ్లేషకులు

ప్రతిభ ఒక్కటే సరిపోదని వ్యాఖ్యలు

క్రికెట్‌ బ్యాట్‌ పట్టడం కూడా తెలియని వ్యక్తి నుంచి మొదలుకొని... ఆటలో తలపండిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! ఊరు, వాడా, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు! ‘ఏం కొట్టాడ్రా బాబు’ అని సాధారణ అభిమానులు కొనియాడుతుంటే... ఫ్లిక్, లాఫ్ట్, పుల్‌ అంటూ విశ్లేషకులు అతడి షాట్లను వర్ణిస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో యావత్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆ కుర్రాడే... బిహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ. 

అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్‌లో అతడు బాదిన బాదుడు క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. అతని దూకుడుకు అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం స్కూలు కుర్రాళ్లలా కనిపించారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్‌... మూడో ఇన్నింగ్స్‌లోనే రికార్డు సెంచరీ... మరో సచిన్‌ టెండూల్కర్‌ దొరికాడు అనే ప్రశంసలతో ఆ పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంత ఎత్తులో ఉన్నాడు! 

ఇదంతా నాణేనికి ఒకవైపే! మన దేశంలో ఇలా ఒక్క ఇన్నింగ్స్‌తో సంచలనాలు రేకెత్తించిన వాళ్లు కోకొల్లలు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్‌ వేదికలపై తళుక్కున మెరిసి... అంతే త్వరగా కనుమరుగై పోయిన వారికి కొదవే లేదు. అంచనాలకు మించి వచ్చే పేరు ప్రతిష్టలు... అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం... అప్పనంగా వచ్చే ప్రచార ఆర్బాటం ఇలా ఆటగాళ్ల దృష్టి మరల్చేవి ఎన్నో. పిన్న వయసులోనే విశేష గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సొదిలోనే లేకుండా పోయిన వాళ్లు ఎందరో! 

సదానంద్‌ విశ్వనాథ్, వినోద్‌ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోకే వస్తారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే సుదీర్ఘ కాలం కెరీర్‌ కొనసాగించగలం అని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నిరూపిస్తే... ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరై కెరీర్‌ను నాశనం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వైభవ్‌ సూర్యవంశీ కూడా ఇలా ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ కాకుండా ఉండాలంటే నిరంతర సాధన ముఖ్యమని మాజీలు సూచిస్తున్నారు. –సాక్షి క్రీడావిభాగం 

వయసుకు మించిన పరిణతితో అతడు బంతిని బాదుతుంటే... యావత్‌ ప్రపంచం విస్మయానికి గురైంది! బౌలర్‌తో సంబంధం లేకుండా అతడు విరుచుకుపడుతుంటే... అభిమాన గణం మైమరిచిపోయింది! ముఖంపై పసితనపు ఛాయలు కూడా పోని ఆ చిన్నోడు చిందేస్తుంటే... క్రీడా లోకం తన్మయత్వానికి లోనైంది! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జైపూర్‌లో జరిగిన పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులు తిరగరాశాడు. 

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా... ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు్కడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మొహమ్మద్‌ సిరాజ్, ఇషాంత్‌ శర్మ, ప్రసిధ్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌ ఈ నలుగురు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఇక టి20 లీగ్‌ల్లో రికార్డులు తిరగరాసే అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సరేసరి. 

ఇలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ వైభవ్‌ సాగించిన ఊచకోత మాటలకందనిది! క్లాస్, మాస్, ఊరమాస్‌ ఇలా అతడి ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అతడి బాదుడుకు జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం హోరెత్తింది. డగౌట్‌లో కూర్చున్న ప్రతి ఆటగాడు ఊగిపోతుంటే... మ్యాచ్‌ చూస్తున్న అభిమానులు బ్యాటింగ్‌ చేసేది తామే అన్నంతగా లీనమై పోయి ఆ ‘బుడ్డోడి’ ప్రతిభకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. 

రాహుల్‌ ద్రవిడ్‌ చొరవతో... 
ఐపీఎల్‌ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత బిహార్‌లోని సమస్తీపూర్‌లో జని్మంచిన వైభవ్‌... కఠోర సాధన, పట్టువదలని తత్వంతో అంచలెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సహచరుడి తప్పిదం వల్ల రనౌట్‌ అయి బెంచ్‌మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్‌ను చూసిన వీవీఎస్‌ లక్ష్మణ్‌... అతడిలో ఆత్మవిశ్వాసం నింపి రాహుల్‌ ద్రవిడ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో వైభవ్‌ దశ తిరిగింది. 

ప్రతిభాన్వేషణ సమయంలో బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, రాజస్తాన్‌ టీమ్‌ మేనేజర్‌ రోమి... వైభవ్‌ షాట్ల ఎంపికకు ముగ్ధులయ్యారు. దీంతో వారు వైభవ్‌ను ద్రవిడ్‌కు పరిచయం చేయడంతో అతడి జీవితం మారిపోయింది. ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యం గతేడాది ఐపీఎల్‌ వేలంలో రూ. 1 కోటీ 10 లక్షలకు వైభవ్‌ను కొనుగోలు చేసుకుంది. 

ద్రవిడ్‌ పర్యవేక్షణలో మరింత రాటుదేలిన వైభవ్‌... దాన్నే మైదానంలో చాటాడు. అప్పటికే భారత అండర్‌–19 జట్టుకు ఎంపికైన వైభవ్‌... గతేడాది జనవరిలోనే ముంబై జట్టుపై ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, కోచ్‌ చెప్పిన అంశాలను ఆచరణలో పెట్టడం. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం వంటి సానుకూల లక్షణాలు అతడిని మూడో మ్యాచ్‌లోనే సెంచరీ హీరోగా నిలిపాయి.  

పొలం అమ్ముకున్న తండ్రి.. 
వైభవ్‌ విజయం వెనక... తాను సాధించలేకపోయిన దాన్ని కుమారుడైనా అందుకోవాలని తపన పడ్డ ఓ మధ్యతరగతి తండ్రి ఆశయం ఉంది. కుమారుడికి మెరుగైన శిక్షణ అందించేందుకు ఉన్న కాస్త పొలం అమ్ముకున్న ఆ తండ్రి ఇప్పుడు అత్యంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడు. గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యూసుఫ్‌ పఠాన్‌ 37 బంతుల్లో సెంచరీ చేయగా... ఇప్పుడు ఈ ఎడంచేతి వాటం బ్యాటర్‌ 35 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. 

దీని వెనక రాయల్స్‌ యాజమాన్య ప్రోత్సాహం ఉందని వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నాడు. ‘వైభవ్‌ మెరుపుల వెనక బిహార్‌ క్రికెట్‌ సంఘం చీఫ్‌ రాకేశ్‌ తివారీ, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కృషి ఎంతో ఉంది. ఇక రాయల్స్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గత మూడు, నాలుగు నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని సంజీవ్‌ అన్నాడు. 

అయితే ఈ మెరుపులు కేవలం ఒకటీ అరా మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే... ఇదే సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరు, డబ్బు తలకెక్కనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతుడు లభించినట్లే! 

అమ్మ, నాన్న కృషి వల్లే... 
తొలి బంతికి సిక్స్‌ కొట్టడం నాకు పెద్ద విషయం కాదన్న వైభవ్‌... అమ్మానాన్న కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే భారత అండర్‌–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశవాళీల్లో తొలి బంతికి చాలాసార్లు సిక్స్‌ కొట్టా. మొదటి 10 బంతులు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాను. బంతి నా పరిధిలో ఉంటే దాన్ని బలంగా కొట్టాలనే చూస్తా. తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను లేను. 

నా కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. తెల్లవారుజామను 3 గంటలకే నిద్రలేచే మా అమ్మ... మళ్లీ నేను పడుకున్న తర్వాత ఏ 11 గంటలకో గానీ నిద్రపోదు. వారు అలా నా కోసం అన్నీ వదిలేసుకొని శ్రమించడం వల్లే నేను ఆటపై దృష్టి సారించగలిగా. నాన్న నా వెంట ఉండటం వల్లే మరింత స్వేచ్ఛగా ఆడుతున్నా. కష్టానికి ఫలితం ఉంటుందని రుజువైంది. వారి కష్టానికి ప్రతిఫలమే ఇది’ అని వైభవ్‌ పేర్కొన్నాడు. 

మరో ఒకటీ రెండేళ్లలో వైభవ్‌ భారత టి20 జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓఝా ఆశాభాహం వ్యక్తం చేశాడు. ‘కోచ్‌గా వైభవ్‌ను చూస్తే గర్వంగా ఉంది. బిహార్‌లో ఆటలకు పెద్దగా ఆదరణ ఉండదు. అలాంటి చోట నుంచి వచ్చి క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వైభవ్‌ ఎందరికో స్ఫూర్తి’ అని మనీశ్‌ ఓఝా అన్నాడు.  

రూ. 10 లక్షల నజరానా 
ఐపీఎల్‌లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీకి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ భారీ నజరానా ప్రకటించారు. 14 ఏళ్ల వైభవ్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ‘గతేడాది వైభవ్‌తో మాట్లాడా. అతడిలో అపార ప్రతిభ ఉంది. తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ఫోన్‌ ద్వారా అతడిని అభినందించా. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవ్‌ సూర్యవంశీకి రూ. 10 లక్షల నజరానా అందిస్తాం. భవిష్యత్తులోనూ అతడు ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. వైభవ్‌ దేశం తరఫున కూడా రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం’ అని నితీశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  

వైభవ్‌ ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడిలో భయం ఏ కోశాన కనిపించడం లేదు. బ్యాట్‌ వేగం, బంతిని అంచనా వేసే తీరు చాలా బాగున్నాయి. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్‌ ఇన్నింగ్స్‌ ఆసాంతం అలరించింది.  –సచిన్‌ టెండూల్కర్‌

14 ఏళ్ల వయసులో మీరేం చేశారో గుర్తు చేసుకొండి. ఈ కుర్రాడు మాత్రం అంతర్జాతీయ బౌలర్ల భరతం పట్టాడు. భయమన్నదే లేకుండా బౌలర్లకు నిద్రలేని రాత్రి మిగిల్చాడు. భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతున్న ఇలాంటి ప్లేయర్లను చూస్తే గర్వంగా ఉంది.  –యువరాజ్‌ సింగ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement