భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.
దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.
వైభవ్ బ్రాండ్ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.
ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు.
శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..
తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్వీర్ సింగ్ చరక్


