
తొలిసారి నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఆరు పతకాలతో మెరిశారు. బ్రెజిల్లోని ఫాజ్ డు లుగాకు నగరంలో ఈ టోర్నమెంట్ జరిగింది. పురుషుల 70 కేజీల విభాగంలో భారత బాక్సర్ హితేశ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హితేశ్తో తలపడాల్సిన ఒడెల్ కమారా (ఇంగ్లండ్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో హితేశ్కు బంగారు పతకం ఖరారైంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు.
ఫైనల్లో అభినాశ్ 0–5తో యురీ రెయిస్ (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్లో పరాజయం పాలైన నలుగురు భారత బాక్సర్లు జాదూమణి సింగ్ (50 కేజీలు), మనీశ్ రాథోడ్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), విశాల్ (90 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. ఆరు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో 19 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పోటీపడ్డారు.