న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్ విభాగాల్లో కలిపి మొత్తం 17 పతకాలతో అదరగొట్టారు. మంగోలియా రాజధానిలో జరిగిన ఈ టోర్నీలో చివరిరోజు భారత రెజ్లర్లు దీపక్ (61 కేజీలు), సాగర్ జగ్లాన్ (74 కేజీలు), దినేశ్ (125 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
ఫైనల్స్లో దీపక్ 6–0తో అసిల్ ఐతాకిన్ (కజకిస్తాన్)పై, సాగర్ 3–2తో తామిర్ ఇషినిమయేవ్ (రష్యా)పై, దినేశ్ 2–0తో యెడిగె కాసిమ్బెక్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. సుమిత్ (57 కేజీలు), మోహిత్ కుమార్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. దాంతో పురుషుల ఫ్రీస్టయిల్ టీమ్ విభాగంలో భారత జట్టు 152 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది.
163 పాయింట్లు సాధించిన రష్యా జట్టుకు టీమ్ టైటిల్ లభించింది. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు సునీల్ కుమార్ (87 కేజీలు), నితేశ్ (97 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. సాహిల్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత జట్టు 119 పాయింట్లతో టీమ్ టైటిల్ దక్కించుకుంది.
మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మనీషా (57 కేజీలు), నేహా (59 కేజీలు), కాజల్ (76 కేజీలు) స్వర్ణ పతకాలు నెగ్గారు. నీలం (50 కేజీలు), హన్సిక లాంబా (55 కేజీలు), మాన్సి (62 కేజీలు), ప్రియ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. దాంతో టీమ్ విభాగంలో 149 పాయింట్లతో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. 175 పాయింట్లతో ఉత్తర కొరియాకు టీమ్ టైటిల్ దక్కింది.


