శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం.. ఘోర పరాజయం | Shreyas Iyer Fails Stunned By CSK Star In T20 Mumbai League | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం.. ఘోర పరాజయం

Jun 3 2026 11:22 AM | Updated on Jun 3 2026 11:34 AM

Shreyas Iyer Fails Stunned By CSK Star In T20 Mumbai League

శ్రేయస్‌ అయ్యర్‌ (PC: X)

ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే శ్రేయస్‌ అయ్యర్‌ మరో టీ20 లీగ్‌ బరిలో దిగాడు. ముంబై టీ20 లీగ్‌లో SoBo ముంబై ఫాల్కన్స్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, స్థానిక లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది.

కాగా ఐపీఎల్‌లో గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరఫున శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరకుండానే..
ఇక ఇదే జోరును కొనసాగిస్తూ ఐపీఎల్‌-2026లోనూ పంజాబ్‌ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే, ఆ తర్వాత అంతా తలకిందులైపోయింది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న శ్రేయస్‌ సేన.. రాజస్తాన్‌ రాయల్స్‌తో పోటీలో వెనుకబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తాజా ఐపీఎల్‌ ఎడిషన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌.. పద్నాలుగు మ్యాచ్‌లు ఆడి 498 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఓ అజేయ శతకం (101) కూడా ఉంది. ఇక ఐపీఎల్‌ ముగిసిన వెంటనే ముంబై టీ20 లీగ్‌లో బ్యాట్‌ ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు శ్రేయస్‌.

శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం 
శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహిస్తున్న SoBo ముంబై ఫాల్కన్స్‌ మంగళవారం ARCS అంధేరి జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అంధేరి కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ శివం దూబే బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

ఘోర పరాజయం
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఫాల్కన్స్‌ను 126 పరుగులకే పరిమితం చేసిన అంధేరి జట్టు.. ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీయడంతో పాటు.. 16 పరుగులు చేసిన శివం దూబే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కాగా జూన్‌ 1 నుంచి 13 వరకు ముంబై టీ20 లీగ్‌ తాజా ఎడిషన్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ లీగ్‌లో బాంద్రా బ్లాస్టర్స్‌, ఈగల్‌ థానే స్ట్రైకర్స్‌, ఆకాశ్‌ టైగర్స్‌ MWS, MSC మరాఠా రాయల్స్‌, నార్త్‌ ముంబై పాంథర్స్‌, ట్రిపుంహ్స్‌ నైట్స్‌ MNE, SoBo ముంబై ఫాల్కన్స్‌, ARCS అంధేరి జట్లు పాల్గొంటున్నాయి.

ఈ లీగ్‌లో టీమిండియా స్టార్లు, ముంబైకర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివం దూబే, సర్ఫరాజ్‌ ఖాన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యశస్వి జైస్వాల్‌, తుషార్‌ దేశ్‌ పాండే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ తదితరులు పాల్గొంటున్నారు. వెటరన్‌ స్టార్‌ అజింక్య రహానే కూడా ఈ లీగ్‌లో భాగమయ్యాడు.

చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్‌.. భువీ రీఎంట్రీ!

Advertisement
 
Advertisement
Advertisement